Sunday, June 24, 2012

మా ఊళ్ళో ఆంజనేయ స్వామి తిరునాళ్ళ


రెండవది: మా ఊళ్ళో ఆంజనేయ స్వామి తిరునాళ్ళ

కొంచెం మా ఊరి గురించి చెప్తాను. మా ఊరు మద్దులూరు. పల్లెటూరు. మొత్తం ఆరు గుళ్ళు (ఇప్పుడు ఏడు), ఒక చెరువు, ఏరు, పక్కనే జామయిలు చెట్లు, తాటితోపు, హైస్కూల్,పక్కనే చింత తోపు, ఒక వీధి బడి, ఒక బిల్డింగ్ ఉన్న బడి, మట్టిరోడ్డు ... ఇలా చెప్పుకుంటే చాలా ఉంటాయి. మన దేశానికీ మా ఊరికి పోలిక కనిపిస్తుంది. మా ఊరికి కూడా మూడు ప్రక్కలా ఏరు పారుతుంటుంది మన దేశానికీ సముద్రాలు ఉన్నట్లు. కాకుంటే ఒక ప్రక్క హిమాలయాలు లేవు. అక్కడ ఆంజనేయస్వామి గుడి ఉంది.

విగ్రహం పొలంలో బయటపడితే ఆ స్థలంలో గుడి కట్టించారు బ్రహ్మసాని కుటుంబీకులు. నా చిన్నప్పుడు ఆ గుడి ఒక పూరిగుడిసె. పేరు గుర్తులేదు కాని ఒక ఆమె అక్కడ ఏర్పాట్లు అన్ని చూస్తుండేది. అంటే శుభ్రం చెయ్యటం లాంటివి. హనుమజ్జయంతి రోజు మాత్రం అక్కడ తిరునాళ్ళ జరిగేది.

ఉదయం నుండి రాత్రి పొద్దు పోయేంత వరకు జరుగుతుంది తిరునాళ్ళ. ఉదయాన్నే కొత్త బట్టలు వేసుకుని గుడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి వచ్చిన ఐసులు, బొమ్మలు, తినుబండారాలు కొనివ్వమని అమ్మవాళ్ళని ఏడిపించి మనం ఏడ్చి ఇంటికొస్తాం. సాయంత్రం అయ్యేసరికి ప్రభలు కట్టుకుని మళ్ళి గుడికి బయలుదేరుతాం. ఆ ప్రభలు మీద దేవుడు బొమ్మలుంటాయా అంటే అదికాదు. తెలుగు దేశం పార్టి వాళ్ళందరూ ఎన్టీఆర్, కాంగ్రెస్ వాళ్ళందరూ కృష్ణ బొమ్మలు వేసుకుని వస్తారు. కొంతమంది దేవుడి బొమ్మలు వేసుకొస్తారు. రాత్రికి డాన్స్ పార్టి ఛండాలంగా. తెలుసుగా మీకు అప్పట్లో డాన్స్ రికార్డింగ్ డాన్సులు ఎలా ఉండేవో. కాని జనాలు అంతా ఎగబడి చూస్తారు. దాన్ని జాగారం అంటారు.

అప్పుడు నాకు అనిపిస్తుంది. ఏం రోజూ వీళ్ళకి భక్తి ఉండదా? ఈ రోజే కొత్తగా వచ్చిందా? అని. 

ఈరోజు ఒక రాజకీయనాయకుడి పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఒక మతం వాళ్ళు వాళ్ళకి ఉన్న దేవుడి/దేవుళ్ళ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఒక పార్టి వాళ్ళు వాళ్ళ నాయకుడి పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. దేవుడికి నాయకుడికి తేడా కనిపించటం లేదు. మీకు తేడా కనిపిస్తుందా?

అంటే దేవుడు కూడా ఒక వర్గానికి నాయకుడు లాంటి వాడా??? 


కాదు కానీ అలా చూడటానికి అలవాటు పడిపోయాం.

నాకు గుర్తున్న చిన్నప్పటి దేవుడు


నాకు గుర్తున్న చిన్నప్పటి దేవుడు (పుట్టింది 1984, ఒక పదేళ్లు చిన్నతనం అనుకుందాం)

మొదటి ఐదేళ్లు ఏమి గుర్తులేదు. ఎవరికీ గుర్తుండదు అనుకుంటాను. ఎవరెవరు ముద్దులు పెట్టారు, ఎవరెవరు ఎత్తుకున్నారు, ఎవరిమీద చుచ్చు పోసామో ఏదీ గుర్తుండదు. అమ్మ వాళ్ళు ఎప్పుడైనా సరదాగా చెప్పుకుంటే తప్ప మనకి తెలీదు. కాని మనం ఎప్పుడైతే బడిలో చేరుతామో అప్పటినుండి అన్నీ గుర్తుంటాయి. దానివల్ల నాకు తెలిసిదేమిటంటే కష్టాలు మొదలైన తర్వాత గుర్తుపెట్టుకోవటం మొదలుపెడతాం అని.

అలా గుర్తున్న వాటిల్లో మొదటిది: నా చిన్నప్పుడు అమ్మానాన్నలతో తిరుపతి వెళ్ళాను. అక్కడ నాకు దర్శనం చేసుకున్నది గుర్తులేదు. వరుసలో నిలబడింది గుర్తులేదు. ఆకరికి తిరుపతి లడ్డు కూడా గుర్తులేదు. గుర్తుంది ఒక్కటే రంగులరాట్నం. మొదటిసారిగా చూసాను. మొత్తం లైట్లు వేసి రంగులు తిరుగుతువుంటే చూడముచ్చటేసింది. విచిత్రం ఏమిటంటే ఎక్కాలి అనిపించలేదు. ఎందుకనేది నాకు తెలీదు. తర్వాత రైలు ఎక్కి ఒంగోలు వచ్చాం. వచ్చే దారిలో ట్రైన్ ఏదో ప్రాబ్లం వస్తే. వేరే నారాయణాద్రి ఎక్కటమో దిగటమో చేసాం. అలా ట్రైన్ మారేటప్పుడు మా నాన్న నన్ను ఎత్తుకు వెళ్ళాడు నేను నిద్ర లేవకపోయేసరికి. ఆ టైం లో ఒంగోలు నుండి మా ఊరికి బస్సులేదు. లారి దొరికితే దానిలో వెళ్ళాం.

ఇక్కడ నాకు దేవుడు ఎవరో తెలీదు. దేవుడిని చూసింది గుర్తు లేదు. మీరు ఇప్పటివరకు తిరుపతి వెళ్లుంటే ఒక్కసారి గర్భగుడి లో దేవుడు విగ్రహం ఎలాఉంటుందో గుర్తుకు తెచ్చుకోండి. మీకు గుర్తుకువస్తే మీరు దేవుడిని మనసుతో చూసినట్టు. లేదంటే భక్తితో చూసినట్టు. భక్తితో చూస్తే మీకు అక్కడి విగ్రహాన్ని చూసినప్పుడు ఏ భావన అయితే ఉందో అదే భావన ఎక్కడ గుళ్ళో విగ్రహాన్ని చూసినా వస్తుంది.

దేవుడు ఉన్నాడా?


నాకు చిన్నప్పటినుండి ఎప్పుడూ ఎవరూ దేవుడి గురించి చెప్పలేదు. అందుకనే నాకు దేవుడు అంటే ఏ భావన లేదు. నేను దేవుడి గురించి ఆలోచించేవాన్నే కాదు. ఏదో అమ్మ చెప్పింది. దణ్ణం పెట్టుకోవాలి. పెట్టుకుంటే మంచిది. అంతకుమించి ఏమి తెలీదు. విచిత్రమేమిటంటే నేను ఎప్పుడూ ఈ దేవుడు ఎవరు ఆ దేవుడు ఎవరు అని అడగలేదు. నాకు తెలిసింది ఒక్కటే. దేవుళ్ళ వల్ల పండగలు వచ్చాయి. పండగల వల్ల శెలవులు వచ్చాయి. కాబట్టి నేను దేవుడు ఉన్నాను అని నమ్మటం మొదలు పెట్టాను.

ఇది చదివే వాళ్ళు ఎవరైనా ఆలోచించండి. మీరు దేవుడు ఉన్నాడు అని ఎప్పటినుండి నమ్మటం మొదలు పెట్టారు. అసలు దేవుడు అంటే ఎవరు అని ఎప్పుడు తెలిసింది? నా వరకు నేను బడికి వెళ్లటం మొదలు పెట్టిన తర్వాతే దేవుడు ఉన్నాడు అని నమ్మటం మొదలు పెట్టాను అనుకుంటుంటాను.